prajavaani.net
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 9:11 pm Digital Edition : PRAJA VANI

తెలంగాణ ఆంధ్ర ప్రధాన రహదారిపై చీకట్లు కల్లూరు మున్సిపాలిటీ నిర్లక్ష్యమా

కల్లూరు మున్సిపాలిటీలో వెలగని వీధి దీపాలు
ప్రజా ప్రభుత్వమా..? “సంక్షేమ” రాజ్యమా..? అని ప్రశ్నిస్తున్న ప్రజలు
కల్లూరు, మే 30: తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు వెలగకపోవడంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి వేళల్లో చీకటి అలుముకోవడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన రహదారిపై రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా, వీధి దీపాల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రి సమయంలో రహదారి స్పష్టంగా కనిపించకపోవడంతో చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయని, భయాందోళనల మధ్య ప్రయాణం చేయాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన సమయంలో వీధి దీపాలు నెలల తరబడి వెలగకపోవడం అధికారుల పనితీరుపై అనుమానాలు కలిగిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. “ప్రజా ప్రభుత్వమని చెప్పుకునే పాలకులు ప్రజల ప్రాథమిక అవసరాలైన వీధి దీపాల సమస్యను కూడా పరిష్కరించలేకపోతే ఎలా?” అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి, ప్రధాన రహదారిపై వెలగని లైట్లను వెంటనే మరమ్మతులు చేసి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.