prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 6:23 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న బండారిగూడెం గ్రామస్తులు

బాపులపాడు జూన్ 5 ప్రజావాణి మండలం, బండారిగూడెం:గన్నవరం నియోజకవర్గ పరిధిలోని బాపులపాడు మండలం బండారిగూడెం గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తూ గ్రామస్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. వర్షాలు కురిసినప్పుడల్లా పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి సీపీఎం పార్టీ నాయకుడు బర్రె లెనిన్ మాట్లాడుతూ, గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండటంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దుర్వాసనతో పాటు వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ వ్యవస్థను సరిచేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. లేనిపక్షంలో గ్రామ సచివాలయాన్ని ముట్టడి చేసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.గ్రామంలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు