డ్రైనేజీ నీరు నిలిచి బాబానగర్ కాలనీవాసుల ఆందోళన..
ప్రజావాణిలో ఫిర్యాదు
అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులు.
ఇరిగేషన్ కాలువను మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు
సిరిసిల్ల, ప్రజావాణి
సిరిసిల్ల–కామారెడ్డి హైవే రోడ్డులోని బాబానగర్ కాలనీలో, జ్యోతిరావు పూలే పాఠశాల ప్రైవేట్ భవనానికి సంబంధించిన డ్రైనేజీ సమస్య తీవ్రంగా మారింది. డ్రైనేజీ నీరు వెళ్లాల్సిన కాలువ అసంపూర్తిగా ఉండటంతో, తాత్కాలికంగా ఇరిగేషన్ కాలువ ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. అయితే, ఆ ఇరిగేషన్ కాలువను ఓ రైతు మూసివేయడంతో డ్రైనేజీ నీరు కాలనీలోనే నిలిచిపోతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీంతో జనసంచారం ఎక్కువగా ఉండే బాబానగర్ కాలనీలో దుర్వాసన వ్యాపించడంతో పాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా తదితర అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.ఈ సమస్యపై సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బాబానగర్కు చెందిన అసారి క్రాంతికుమార్ జిల్లా అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు, ఇరిగేషన్ కాలువ ద్వారా డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాలనీవాసులు వ్యాధుల బారిన పడకుండా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.

