prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 8:02 am Digital Edition : PRAJA VANI

డ్రైనేజీలు శుభ్రం చేయక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పట్టించుకోని గ్రామ సర్పంచ్  గ్రామ కార్యదర్శిపై గ్రామస్తుల ఆగ్రహం

డ్రైనేజీలు శుభ్రం చేయక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
పట్టించుకోని గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శిపై గ్రామస్తుల ఆగ్రహం
రామగిరి, జూలై 26 (మన ప్రజావాణి):
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం చందనాపూర్ గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అధ్వాన్నంగా మారిందని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని పలు వీధుల్లో డ్రైనేజీలు నెలల తరబడి శుభ్రం చేయకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని తెలిపారు.
వర్షాలు కురిసిన సమయంలో డ్రైనేజీలు పొంగిపొర్లి మురుగునీరు రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శికి పలుమార్లు సమస్యను వివరించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.
మురుగునీరు నిల్వ ఉండడం వల్ల దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అపరిశుభ్ర వాతావరణం కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలోని అన్ని డ్రైనేజీలను వెంటనే శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.