prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 April 2026, 2:46 am Digital Edition : ANIL CHIGURUMAMIDI

డీఏ బకాయిలు విడుదల చేయాలి

నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల నిరసన

చిగురుమామిడి (మన ప్రజావాణి ప్రతినిధి): సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీజీఈ జేఏసీ (తెలంగాణ ఎంప్లాయీస్‌, టీచర్స్‌ అండ్‌ పెన్షనర్స్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) డిమాండ్ చేసింది. రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా శుక్రవారం చిగురుమామిడి మండల కేంద్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.అనంతరం భోజన విరామ సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని తహసీల్దార్ ముద్దసాని రమేష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ… గత కొంతకాలంగా ఉద్యోగులకు రావాల్సిన డీఏ (కరువు భత్యం) బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్‌లో ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.పీఆర్‌సీ (వేతన సవరణ సంఘం) నివేదికను త్వరితగతిన అమలు చేయాలని, పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన బెనిఫిట్స్ సకాలంలో విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోని పక్షంలో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.