**
* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 27
పట్టణంలోని పట్టణ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ సంఘం భవనంలో సోమవారం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ సౌజన్యంతో కంటిన్యూయింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ (సిఎంఈ) శిక్షణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మెడికల్ అధికారిని డాక్టర్ జయసుప్రజ హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు, జ్వరాల నివారణ, ప్రాథమిక చికిత్స, ఆధునిక వైద్య విధానాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు. సీజనల్ వ్యాధుల లక్షణాలు, నివారణ చర్యలు, ప్రాథమిక చికిత్సలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆధునిక వైద్య విధానాలతో పాటు డాక్టర్ రెడ్డీస్ సంస్థ తయారు చేస్తున్న ఔషధాల నాణ్యత, వినియోగం, ప్రభావంపై ఆమె విస్తృతంగా వివరించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలు అందిస్తున్న ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులకు ఈ అవగాహన సదస్సు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో లేని సమయంలో ప్రజలకు తొలి వైద్య సహాయం అందించే వైద్యులకు ఇటువంటి శిక్షణా కార్యక్రమాలు అత్యంత అవసరమన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ యాజమాన్యానికి, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జయసుప్రజ కు పట్టణ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదాసు శంకరయ్య, మందమర్రి పట్టణ అధ్యక్షుడు గోనె గోవర్ధన్,గౌరవ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్,వర్కింగ్ ప్రెసిడెంట్ మంద తిరుమల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి అడ్డూరి సాంబమూర్తి, కోశాధికారి వేముల నరసయ్య, ఉపాధ్యక్షులు గాజుల శంకర్, చింతల పోశం, పానుగంటి పరమాత్మ, నర్సింగోజు తిరుపతి, గోనె సత్యం, మతిన్ ఖాన్, విజయ్ శర్మ, ఎస్కె ఖాన్, గోనె శ్రీనివాస్, తిప్పని శ్రీనివాస్,ఆర్ఎంపీ, పీఎంపీ వైద్యులు పాల్గొన్నారు.