రెండు రోజుల్లో గ్రామ సభల నిర్వహణకు ఆదేశం
జైపూర్, జూలై 27,ప్రజావాణి:
ఉమ్మడి జిల్లా అధికారుల ఆదేశాల మేరకు స్థానిక రైతు వేదిక భవనంలో సోమవారం మండల పరిషత్ అధికారుల ఆధ్వర్యంలో “వికసిత్ భారత్ – గ్రామీణ ఉపాధి, జీవనోపాధి హామీ చట్టం” “జలసిరి” పథకాలపై మండల స్థాయి సిబ్బందికి ఒక రోజు అంతర్జాల (ఆన్లైన్) శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎం.పి.డి.ఓ జి.సత్యనారాయణ, ఎం.పి.ఓ బాపురావు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ.. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో భూగర్భ జలాల పెంపకానికి గానూ వ్యవసాయ కుంటలు, ఇంకుడు గుంతలు, బోరు బావుల పునరుజ్జీవన పనులు, వర్షపు నీటి నిల్వ నిర్మాణాల కొరకు ప్రదేశాలను తక్షణమే గుర్తించి, అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నీటి సంరక్షణ పనులపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి, స్థలాలను ఖరారు చేయడానికి రాబోయే రెండు రోజుల్లోగా అన్ని గ్రామాల్లో ‘గ్రామ సభలు నిర్వహించాలని పంచాయతీ కార్యదర్శులను యుద్ధప్రాతిపదికన ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఏపిఓ బాలయ్య,ఈసీ రాజమౌళి, ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు గాయత్రి, మండల వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సాంకేతిక క్షేత్ర సహాయకులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.