prajavaani.net
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 5:49 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

జూన్ 9 ధర్నాను జయప్రదం చేయాలి – సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు

పోలవరం జూన్ 5 ప్రజావాణి మండలం వింజరం గ్రామంలో నిర్వహించిన సిపిఎం విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్. లింగరాజు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండించారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం వల్ల సామాన్య ప్రజల జీవనం దుర్భరంగా మారిందని ఆయన అన్నారు.కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ, ప్రజలపై పన్నుల భారం మోపుతోందని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, రైతులు, కార్మికులు, గిరిజనుల సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో జూన్ 9న నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని ప్రజలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆర్. లింగరాజు పిలుపునిచ్చారు. అనంతరం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ ఎల్‌టీఆర్ (1/70) చట్టం, అటవీ హక్కుల చట్టాల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఖండిస్తున్నామని అయన అన్నారు.ఆదివాసీల భూమి, అటవీ హక్కులను పరిరక్షించేందుకు రూపొందించిన ఎల్‌టీఆర్ (1/70) చట్టం, అటవీ హక్కుల చట్టం (ఎఫ్ ఆర్ ఏ -2006)లను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు.షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీ భూములు గిరిజనేతరుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు తీసుకొచ్చిన 1/70 చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.బీజేపీ ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో చట్ట ఉల్లంఘనలు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అక్రమ భూకబ్జాలు, భూముల బదలాయింపులు, ఆదివాసీలను వారి సంప్రదాయ భూముల నుంచి దూరం చేసే చర్యలు పెరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అటవీ హక్కుల చట్టం ప్రకారం వ్యక్తిగత, సామూహిక హక్కులను గుర్తించి పట్టాలు ఇవ్వాల్సి ఉండగా, వేలాది దరఖాస్తులు ఇంకా పెండింగ్‌లో ఉండటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. అటవీ సంపదపై ఆదివాసీల హక్కులను గౌరవించకుండా అధికార యంత్రాంగం వ్యవహరించడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఆదివాసీల భూమి, అటవీ, జీవన హక్కులను పరిరక్షించేందుకు ఎల్‌టీఆర్ (1/70) చట్టం, అటవీ హక్కుల చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలను వెంటనే పరిష్కరించాలని, అర్హులైన ప్రతి ఆదివాసీ కుటుంబానికి హక్కుల పట్టాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివాసీ హక్కుల పరిరక్షణ కోసం సిపిఎం నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు.జులై 3,4,5తేదీలలో ఏలూరులో జరిగేఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (ఏ ఐ కె ఎస్ )రాష్ట్ర 23వ మహాసభల విజయవంతం కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలనీ సిపిఎం మండల కార్యదర్శి కారం భాస్కర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండల నాయకులు మడివి చలపతిరావు, గోకూరి పాండవులు, తాటి శాంతి, దర్ముల లక్ష్మి,డి సుబ్బయమ్మ,ఎం రాంబాబు, జి రామకృష్ణ, ఎం వీరాయమ్మ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు