prajavaani.net
Newspaper Banner
Date of Publish : 26 July 2026, 9:36 am Digital Edition : PRAJA VANI

జాతీయ ఓబీసీ మహాసభలను విజయవంతం చేయండి

*జాతీయ ఓబిసి మహాసభలను విజయవంతం చేయండి*

*ఆగష్టు 7న బెంగళూరులో ఓబీసీ జాతీయ మహాసభ*

*మహాసభ వాల్ పోస్టర్లు, కరపత్రాలు విడుదల*

* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 25

బిపి మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న బెంగళూరులో నిర్వహించు అఖిలభారత జాతీయ ఓబీసీ 11వ మహాసభలను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు కొండిల్ల శ్రీనివాస్ కోరారు. శనివారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాసభ వాల్ పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, బీసీల ఐక్యత హక్కుల సాధన కోసం ప్రతి ఒక్కరూ ఈ మహాసభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం మండల్ కమిషన్ 1980లో తన నివేదికలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 27శాతం రిజర్వేషన్లు, భూ సంస్కరణలు, వెనుకబడిన వర్గాలకు విద్యలో కోటాలు కల్పించాలని సిఫారసు చేసిందని, ఆగస్టు 7న మండల్ కమిటి సిఫార్సులు అమలులోకి వచ్చిన సందర్భంగా గత 11 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో ఓబిసి మహా సభలను నిర్వహిస్తున్నట్టు  తెలిపారు. ఈ సంవత్సరం సైతం 11వ ఓబీసీ జాతీయ మహాసభలను బెంగళూరులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఓబిసి జాతీయ మహాసభ కార్యక్రమానికి బీసీ లందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు .దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలంతా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం కావాలని, వారిని ఏకతాటి పైకి తీసుకురావడమే లక్ష్యంగా ఆగస్టు 7న బెంగళూరులో 11వ జాతీయ ఓబీసీ జాతీయ మహాసభను నిర్వహిస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న 80 కోట్ల మంది ఓబీసీ ల డిమాండ్ల పరిష్కారమే ధ్యేయంగా, రాజ్యాధికారమే లక్ష్యంగా ఈ మహాసభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది 11వ జాతీయ మహాసభను బెంగళూరులోని డాక్టర్ మన్మోహన్ సింగ్ సిటీ యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తుండగా, ఈ మహాసభకు 29 రాష్ట్రాల నుంచి ఓబీసీ ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు తడిగొప్పుల రవిరాజా, రాయబారపు కిరణ్, మూడారపు శేఖర్, గాండ్ల సంజీవ్, మడ్డి వేణు గోపాల్ గౌడ్, జాడ క్రాంతి కుమార్, గరిగే సుమన్, మాయ రమేష్,ఖలీం, చోటు, రెడ్డి రాజుల కిరణ్ లు పాల్గొన్నారు.