ప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)బద్వేలు మండలం చింతలచెరువు గ్రామంలో నిర్వహించిన ‘జలధార’ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ చెరుకూరి శ్రీధర్ గారు, మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కె. విజయమ్మ గారు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ కె. రితేష్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జిల్లాలో నీటి భద్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. నీటి సంరక్షణ మన అందరి సమిష్టి బాధ్యత అని, ఈ విషయంలో సాగునీటి సంఘాల పాత్ర అత్యంత కీలకమని వారు స్పష్టం చేశారు. నీటి వనరులను కాపాడుకోవడానికే 100 రోజుల ప్రత్యేక యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.కార్యక్రమంలో భాగంగా వారు స్థానిక రైతులతో ముఖాముఖి నిర్వహించి, పంట దిగుబడులు మరియు లాభనష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది దిగుబడులు ఆశాజనకగా ఉన్నాయని, మంచి లాభాలు వచ్చాయని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం నీటి సంఘం అధ్యక్షులతో చర్చించి చెరువుల పరిస్థితిపై ఆరా తీశారు. చెరువుల మరమ్మతులు, పూడిక తీత మరియు ఆక్రమణల సమస్యలను రైతులు వారి దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన కలెక్టర్ గారు మరియు రితేష్ రెడ్డి గారు, చెరువుల పునరుద్ధరణ పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆక్రమణలకు గురైన చెరువుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.