•జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా టిడబ్ల్యూజెఎఫ్ మహాసభ
*పటాన్చెరులో మూడవ మహాసభ విజయవంతం
* నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక
*హక్కుల పరిరక్షణ, సంక్షేమంపై దిశానిర్దేశం
పటాన్చెరు, ఆగస్టు 6 (ప్రజావాణి): తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజెఎఫ్) జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తోందని టిడబ్ల్యూజెఎఫ్ జాతీయ కార్యవర్గ సభ్యుడు సుదర్శన్రెడ్డి అన్నారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలు కోసం సంఘం నిరంతరం పోరాటం చేస్తుందని, కష్టకాలంలో ప్రతి పాత్రికేయుడికి అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.గురువారం పటాన్చెరులోని ఐబీ అతిథి గృహంలో నిర్వహించిన టిడబ్ల్యూజెఎఫ్ పటాన్చెరు నియోజకవర్గ మూడవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర నాయకులు మేకల కృష్ణయ్య, ప్రభు, జిల్లా అధ్యక్షుడు ఎల్గోయి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ పాల్గొని జర్నలిస్టుల ఐక్యత, హక్కుల సాధన, సంక్షేమ కార్యక్రమాల అమలుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాదిని శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కొత్తకొండ సత్యం ఎన్నికయ్యారు. గౌరవ సలహాదారులుగా వాసుదేవ్, శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా రవీందర్ చారి, నరసింహారెడ్డి, సంగమేశ్వర్, సహాయ కార్యదర్శులుగా గిరి, ప్రసాద్, కృష్ణగౌడ్, రాము, కోశాధికారిగా భానుచందర్, ప్రచార కార్యదర్శిగా ముద్దంగుల ఎల్లయ్య, ఈసీ కమిటీ సభ్యులుగా గణేష్, రాజు, రాజశేఖర్, విజయ్, రమేష్లను ఎన్నుకున్నారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు ఎల్గోయి ప్రభాకర్ మాట్లాడుతూ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, వృత్తిపరమైన సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై మహాసభలో విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. సంఘ బలోపేతంతోనే జర్నలిస్టుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, హక్కుల సాధనకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కరోనా కాలంలో హైదరాబాద్ నుంచి జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలకు వెళ్లిన పాదచారులకు భోజనం, తాగునీరు అందించామని, ఇతర రాష్ట్రాల్లోని తెలుగు వారికి కూడా టిడబ్ల్యూజెఎఫ్ ద్వారా సహాయం అందించినట్లు గుర్తు చేశారు. దాతల సహకారంతో జర్నలిస్టుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు. టిడబ్ల్యూజెఎఫ్ సభ్యులు సేవాభావంతో పనిచేస్తూ జర్నలిస్టుల ఐక్యతను మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు.
అనంతరం సమావేశంలో పాల్గొన్న అతిథులకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు, సంఘ నాయకులు, కమిటీ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.