చిగురుమామిడి లో దూడపై హైనా దాడి –
మన ప్రజావాణి ప్రతినిధి (చిగురుమామిడి): చిగురుమామిడి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి దూడపై హైనా దాడి చేసి చంపిన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. గ్రామానికి చెందిన రైతు బొల్లి చంద్రయ్య తన పొలం వద్ద ఎప్పటిలాగే దూడను కట్టివేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో అడవి నుండి వచ్చిన హైనా దూడపై దాడి చేసి చంపింది.
శనివారం ఉదయం పాలు పిండడానికి పొలం వద్దకు వెళ్లిన రైతు బొల్లి చంద్రయ్య దూడ మృతి చెందిన విషయాన్ని గమనించి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయం గ్రామంలో తెలిసిన వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారి శేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దూడపై హైనా దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని శివప్రసాద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా దూడ మృతి చెందడంతో నష్టపోయిన రైతు బొల్లి చంద్రయ్యను ప్రభుత్వం తరఫున ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు అటవీ శాఖ అధికారులను కోరారు. గ్రామ పరిసర ప్రాంతాల్లో అడవి జంతువుల సంచారం పెరుగుతున్నందున తగిన చర్యలు తీసుకోవాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు.