ఘట్కేసర్, జూలై 17: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి అధ్యక్షతన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – ఎస్ఐఆర్)పై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ వాణి మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, లోపాలు లేకుండా జరగాలంటే రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు చురుకుగా భాగస్వాములు కావాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం, జాబితాలోని పొరపాట్లను సరిదిద్దడం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు), రాజకీయ పార్టీల ప్రతినిధులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయాలని ఆమె సూచించారు. సమగ్రమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా రూపకల్పన కోసం రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలను అప్రమత్తం చేసి, అర్హులైన ఓటర్ల నమోదు, వివరాల సవరణకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
సమావేశంలో అధికారులు ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని సమీక్షించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి తగిన సూచనలు చేశారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.
