ఘట్కేసర్, ఆగస్టు 5: అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) ఘట్కేసర్ మండల మహాసభలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ విషయాన్ని ఏఐవైఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సల్మాన్ బేగ్, జిల్లా కార్యదర్శి టి. సత్య ప్రసాద్ వెల్లడించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగం, విద్య, వైద్యం, ప్రభుత్వ ఖాళీల భర్తీ, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ వంటి ప్రజా సమస్యలపై ఉద్యమాలను మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామస్థాయి నుంచి యువతను సంఘటితం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 8, 9, 10 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో జరగనున్న ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర మూడో మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా కృషి చేయాలని నూతన కమిటీ నిర్ణయించిందని తెలిపారు.
మండల నూతన కమిటీ అధ్యక్షుడిగా సంపంగి సదాశివ, కార్యదర్శిగా ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా శివ, సాయి పాస్వాన్, దేవేందర్, సహాయ కార్యదర్శులుగా జాన్, పల్లెచిన్ని యాదగిరి, కోశాధికారిగా శ్రీను ఎన్నికయ్యారు. కౌన్సిల్ సభ్యులుగా మధుసూధన్, వెంకట్ స్వామి, మనోజ్ కుమార్, రమేష్, సృజన్, సంజయ్, లవాన్, నితిన్, సాయి ప్రసాద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
నూతన కమిటీ సభ్యులకు జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువజన సమస్యల పరిష్కారంలో ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.