prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 8:43 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్ పరిధిలో “నేను సైతం 2.0” కార్యక్రమం – 100 సీసీటీవీ కెమెరాల ప్రారంభం.. భద్రతలో ప్రజల భాగస్వామ్యం అవసరం

ఘట్‌కేసర్, జూలై 7 (ప్రజావాణి): మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘట్‌కేసర్, ఎదులాబాద్, ఔషాపూర్, కొండాపూర్ గ్రామాల్లో “నేను సైతం 2.0” కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 100 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల భద్రతలో సీసీటీవీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని ఇళ్లు, వ్యాపార సంస్థలు, కాలనీల భద్రతను మరింత పటిష్టం చేసుకోవచ్చని పేర్కొన్నారు.

“ఒక సీసీటీవీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం” అని పేర్కొంటూ, కెమెరాలు 24 గంటలపాటు నిరంతర నిఘా నిర్వహిస్తాయని, నేరాల నివారణతో పాటు నిందితులను గుర్తించడంలో కీలక ఆధారాలుగా నిలుస్తాయని వివరించారు. దొంగతనాలు, ప్రమాదాలు లేదా ఇతర అవాంఛనీయ ఘటనల సమయంలో సీసీటీవీ ఫుటేజ్ దర్యాప్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.

ప్రస్తుత సాంకేతికతతో మొబైల్ యాప్‌ల ద్వారా ఎక్కడి నుంచైనా ఇంటి, దుకాణాల పరిస్థితిని ప్రత్యక్షంగా పర్యవేక్షించవచ్చని, మహిళలు, పిల్లలు, వృద్ధుల భద్రతకు కూడా సీసీటీవీ కెమెరాలు ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.

ప్రజలు తమ ఇళ్లు, దుకాణాలు, అపార్ట్‌మెంట్‌ల వద్ద నాణ్యమైన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, నైట్ విజన్, మోషన్ సెన్సార్ వంటి సౌకర్యాలు కలిగిన కెమెరాలను వినియోగించాలని సూచించారు. ఇతరుల గోప్యతకు భంగం కలగకుండా కెమెరాలను అమర్చాలని తెలిపారు.

“నేను సైతం 2.0” కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి యజమాని, వ్యాపారవేత్త, కాలనీ సంక్షేమ సంఘాలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని సురక్షిత సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఘట్‌కేసర్ ఇన్‌స్పెక్టర్ బాలస్వామి, డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐలు ప్రభాకర్ రెడ్డి, శేఖర్, రాఘవేంద్ర, హీనా తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.