ఘట్కేసర్లో గత 17 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘట్కేసర్ బైపాస్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఘట్కేసర్ 6వ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి నాయకత్వం వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆర్ఓబీ నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టర్ సత్తిరెడ్డితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నాయకులు “ఇదిగో బ్రిడ్జి – అదిగో బ్రిడ్జి” అంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ పనులు పూర్తయినట్లు ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించే చర్య అని ఆరోపించారు.
కాంట్రాక్టర్ సత్తిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, ఇప్పటికే పూర్తయిన పనులకు సంబంధించిన సుమారు 20 శాతం బిల్లులు ప్రభుత్వం నుంచి ఇంకా విడుదల కాలేదని, అలాగే ఆర్ఓబీ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి మరో ఆరు కోట్ల రూపాయలకు పైగా నిధులు అవసరమని వెల్లడించారు. అవసరమైన నిధులు సకాలంలో విడుదలైతే 2026 డిసెంబర్ నాటికి పనులను పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారని బీజేపీ నాయకులు తెలిపారు.
అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు కేవలం నాలుగు కోట్ల రూపాయలు వస్తే పనులు పూర్తవుతాయని, నిధులు ఇప్పటికే విడుదలయ్యాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల ప్రాణాలకు సంబంధించిన కీలక అంశాలపై రాజకీయాలు చేయడం బాధ్యతారాహిత్యమని, వాస్తవాలను దాచిపెట్టి ప్రజలను మోసం చేసే ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఘట్కేసర్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే రాజకీయాలను ఇకనైనా ఆపాలని, ఆర్ఓబీ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయడమే అన్ని రాజకీయ పార్టీల లక్ష్యంగా ఉండాలని బీజేపీ స్పష్టం చేసింది. ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, అవసరమైతే మరింత ఉద్ధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించింది.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు పడిగెం వీరేశం, పసులాది చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్, యువ మోర్చా అధ్యక్షుడు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకుడు బాల నరసింహ, కిసాన్ మోర్చా నాయకుడు కట్ట మధుసూదన్ రెడ్డి, యువ మోర్చా ఉపాధ్యక్షుడు సురువు అనిల్ గౌడ్, సీనియర్ నాయకులు బండ్లగూడం కిషోర్ గౌడ్, లంబ పవన్ యాదవ్, మమతా శర్మ, శ్యామ్ రెడ్డి, సాయి గౌడ్, తేజావత్ సుదీర్, కళ్లెం మహేష్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.