ఘట్కేసర్, ఏప్రిల్ 20 (ప్రజావాణి): ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలో మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ) సభ్యులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఏ. వాణి మరియు ఇన్చార్జి ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ సురేష్ మహిళలకు ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై విస్తృతంగా వివరించారు. ముఖ్యంగా మహిళల ఆర్థిక అభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాలు, బ్యాంకు రుణాలు, సబ్సిడీ పథకాలు, సామాజిక భద్రత అంశాలపై స్పష్టమైన మార్గనిర్దేశం చేశారు.
అలాగే పథకాల అర్హతలు, దరఖాస్తు విధానం, పొందే ప్రయోజనాలపై సభ్యులకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్హెచ్జీ సభ్యులు తమ సందేహాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, వారు తగిన సమాధానాలు ఇచ్చారు.
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్, పార్కు ప్రాంగణాల్లో ఫుడ్ స్టాళ్లు ఏర్పాటు వంటి స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకుని కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు.
అదనంగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడం, తడి చెత్త–పొడి చెత్తను వేరు చేయడం, ఇంటి ముందుకు వచ్చే చెత్త ఆటోలకు చెత్త అందించడం వంటి పరిశుభ్రత అంశాలపై కూడా సభ్యులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎస్హెచ్జీ సభ్యులు పాల్గొన్నారు.