prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 8:17 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఘట్‌కేసర్‌లో ఎఐటియుసి మండల 4వ మహాసభ…… మండల అధ్యక్షుడిగా బాలనర్సయ్య, కార్యదర్శిగా శ్రీనివాసరావు ఏకగ్రీవ ఎన్నిక

ఘట్‌కేసర్ మండల కేంద్రంలోని మహిళ డ్వాక్రా భవనంలో ఎఐటియుసి మండల 4వ మహాసభ రాష్ట్ర సమితి సభ్యుడు కల్లూరి జయచంద్ర అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఎఐటియుసి జాతీయ సమితి సభ్యుడు రవిచందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మికుల పోరాటాల ఫలితంగా అమలులో ఉన్న 44 కార్మిక చట్టాల్లో 29 చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్‌లను తీసుకువచ్చి కార్మికుల హక్కులను బలహీనపరిచిందని విమర్శించారు. సంపన్న వర్గాలకు అనుకూలంగా విధానాలు అమలు చేస్తూ కార్మికులు, పేదల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పేదలు పేదలుగానే మిగిలిపోతుండగా, అనేక కుటుంబాలకు నివాస గృహాలు కూడా లేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా నియమించకపోయినా, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కనీసం రూ.26 వేల వేతనం చెల్లించాలని ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఎఐటియుసి ఆధ్వర్యంలో మరింత ఐక్యంగా ఉద్యమాలు చేపట్టి హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 11వ తేదీన యాప్రాల్‌లో జరగనున్న మేడ్చల్ జిల్లా 4వ మహాసభలో భవిష్యత్ కార్యాచరణను రూపొందించి, కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాటాలను మరింత ఉధృతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

అనంతరం జరిగిన ఎన్నికల్లో ఘట్‌కేసర్ మండల ఎఐటియుసి అధ్యక్షుడిగా బాలనర్సయ్య, మండల కార్యదర్శిగా శ్రీనివాసరావు, మండల గౌరవ అధ్యక్షుడిగా కల్లూరి జయచంద్రలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎఐటియుసి ఉపాధ్యక్షుడు లోట్టి ఈశ్వర్, మున్సిపల్ సంఘం నాయకుడు రామచందర్ తదితరులు పాల్గొన్నారు.