ఘనంగా విస్డంహైస్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు
చిగురుమామిడి (మన ప్రజావాణి ప్రతినిధి):
పాఠశాలలో నిర్వహించే గ్రాడ్యుయేషన్ డే వేడుకలు చిన్నారి విద్యార్థులలో చదువుపై ఆసక్తిని పెంచడమే కాకుండా, వారిలో సృజనాత్మకతను పెంపొందిస్తాయని బొమ్మనపల్లి విస్డం ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్ కంది సంధ్య, ప్రిన్సిపాల్ మోర సత్యనారాయణ తెలిపారు.
శనివారం మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలోని విస్డం హైస్కూల్లో గ్రాడ్యుయేషన్ డే వేడుకలను విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ప్రీ-ప్రైమరీ, కేజీ తరగతుల విద్యార్థులకు చిన్నారుల తొలి విద్యా మైలురాయిని పురస్కరించుకుని ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు గ్రాడ్యుయేషన్ గౌన్లు, టోపీలు ధరించి సర్టిఫికెట్లు అందుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించడం తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందించడమే విస్డం స్కూల్ లక్ష్యమని తెలిపారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చుకోవాలని, ఇలాంటి కార్యక్రమాలు చిన్నారుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి ప్రాథమిక విద్యకు బలమైన పునాది వేస్తాయని పేర్కొన్నారు.
పునాది స్థాయి విద్యను విజయవంతంగా పూర్తి చేసినందుకు గుర్తుగా విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. పిల్లల ఎదుగుదలలో ఉపాధ్యాయుల కృషిని ఈ సందర్భంగా అభినందించారు. చిన్నారుల ఆటపాటలు, నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తోట రమేష్, ప్రవీణ, అప్పాల రమేష్, ఎండ్ర రాజు, బోలిశెట్టి సురేశ్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.