సిద్దిపేట్ మర్కుక్, ఏప్రిల్ 10 ప్రజావాణి
సిద్దిపేట జిల్లా పరిధిలో గ్రామాల్లో శాంతి భద్రతల బలోపేతం, సామాజిక అవగాహన పెంపు లక్ష్యంగా గజ్వేల్ రూరల్ పోలీసులు విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు గజ్వేల్ రూరల్ సీఐ రవిరాజు, మర్కుక్ ఎస్ఐ దామోదర్ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులతో ఈ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐ రవిరాజు ఎస్సై దామోదర్ లు మాట్లాడుతూ, .సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “మన పోలీస్–మన ఊరు” కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం ఒక గ్రామాన్ని ఎంపిక చేసి, కులమత భేదాలకు అతీతంగా గ్రామస్తులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను తెలుసుకునీ అక్కడికక్కడే సమస్యను పరిష్కారం చేస్తామని తెలిపారు.అదేవిధంగా, “ఆన్సైట్ ఎఫ్ఐఆర్” కార్యక్రమం ద్వారా బాధితుల వద్దకే పోలీసులు వెళ్లి సేవలు అందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి, దీనిపై విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఎండాకాలంలో కాలువల వద్దకు వెళ్లి ప్రమాదాలకు గురవుతున్న విద్యార్థులపై ప్రత్యేక నిఘా అవసరమని సూచించారు. గ్రామ పాలకవర్గాల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టి భద్రతను పెంపొందించాలని తెలిపారు. గ్రామాల్లో సామాజిక పరివర్తన కోసం ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.అలాగే, ‘100’ డయల్ సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచిస్తూ, ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి పెరుగుతున్న ఆన్లైన్ బెట్టింగ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఆర్థిక ఇబ్బందులకు గురై ప్రాణాలు కోల్పోతున్న ఘటనలను దృష్టిలో ఉంచుకుని, గ్రామ స్థాయిలోనే ఈ బెట్టింగ్లను నియంత్రించేందుకు పాలకవర్గాలు ముందుకు రావాలని కోరారు.రోడ్డు భద్రతపై దృష్టి సారిస్తూ, మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంక్ డ్రైవింగ్)కు పూర్తిగా దూరంగా ఉండాలని హెచ్చరించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వ్యక్తి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని సూచించారు.జిల్లా పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నిరుద్యోగ యువత తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పొందేందుకు ముందుకు రావాలని తెలిపారు.ఈ సమావేశంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో శాంతి భద్రతలు, సామాజిక బాధ్యతల పట్ల ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి సమావేశాలు దోహదపడతాయని అధికారులు పేర్కొన్నారు..
