ఎమ్మెల్యే డా. కవంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్
బెజ్జంకి, జూన్ 30 (ప్రజావాణి)
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గూడెం గ్రామానికి రూ.18 లక్షల విలువైన సీసీ రోడ్ల నిర్మాణ నిధులు మంజూరయ్యాయి. దీంతో గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గూడెం గ్రామ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు గూడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ, గ్రామానికి నిధులు మంజూరు చేయించడంలో ప్రత్యేక కృషి చేసిన మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవంపల్లి సత్యనారాయణకు, అలాగే సహకరించిన మాజీ ఎంపీపీ ఒగ్గు దామోదర్కు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మంజూరైన నిధులతో గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరుస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులకు గూడెం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.