prajavaani.net
Newspaper Banner
Date of Publish : 31 July 2026, 6:44 am Digital Edition : NAZEER CHENNOOR

గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జైపూర్ సబ్ ఇన్స్పెక్టర్ భూమేష్

జైపూర్,జూలై 31,ప్రజావాణి:

కడెం ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా నీటి విడుదలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో, గురువారం సాయంత్రం 7.30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని జైపూర్ ఎస్సై తెలిపారు.

ఈ నేపథ్యంలో గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా చేపలు పట్టేందుకు నదిలోకి వెళ్లేవారు, రైతులు, పశువులు, గొర్రెలు మేపేందుకు వెళ్లే కాపరులు ఎట్టి పరిస్థితుల్లోనూ నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లరాదని హెచ్చరించారు.

జైపూర్ మండలంలోని ఇందారం, టేకుమట్ల, శెట్ పల్లి పల్లి, కుందారం, కిష్టాపూర్, బెజ్జాల తదితర గోదావరి దిగువ గ్రామాల ప్రజలకు ఈ విషయాన్ని వెంటనే తెలియజేయాలని కోరారు. సంబంధిత గ్రామాల సర్పంచ్‌లు తమ గ్రామాల్లో డప్పు చాటింపు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని పోలీసు శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.

వరద నీటి ప్రవాహం పూర్తిగా తగ్గే వరకు ఎవరూ నిర్లక్ష్యంగా నదీ పరివాహక ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, ప్రాణ భద్రతే ముఖ్యమని ఎస్సై ప్రజలకు పిలుపునిచ్చారు.