ప్రజావాణి న్యూస్ :(మార్చి08) బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలంలోని గొంటువారిపల్లె గ్రామంలో రేగులగడ్డ వారి కుటుంబంలో నిర్వహించిన కేశ ఖండన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బిసివై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై చిన్నారిని ఆశీర్వదించి కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకున్నారు.ఈ సందర్భంగా ముందుగా ఆయన పోరుమామిళ్ల పట్టణానికి చేరుకుని డాక్టర్ .బి .ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అక్కడి నాయకులు, కార్యకర్తలతో కలిసి గొంటువారిపల్లె గ్రామానికి వెళ్లి కేశ ఖండన కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.తరువాత జరిగిన కార్యక్రమంలో బిసివై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ ఆధ్వర్యంలో ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బిసివై పార్టీలో చేరారు. దాదాపు 500 మంది నాయకులు, కార్యకర్తలు పార్టీ కండువా కప్పుకుని బిసివై పార్టీలో చేరడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పార్టీ నాయకులు వారిని సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా బోడె రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ… కాశినాయన మండలంతో తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉందని తెలిపారు. ఈ మండలానికి పెద్దల ఆహ్వానం మేరకు ఇప్పటికే మూడు సార్లు వచ్చానని, ఇక్కడి ప్రజలతో, ముఖ్యంగా బీసీ సోదరులతో కలవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా వాటి పరిష్కారానికి కృషి చేయాలని తాను సంకల్పించుకున్నానని అన్నారు.అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజలను మోసం చేస్తోందని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధపు మాటలతో ప్రజలను నమ్మించి ఇప్పుడు నట్టేట ముంచారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కొన్ని వర్గాలకే పరిమితమయ్యాయని, సామాన్య బహుజన వర్గాలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలేదని అన్నారు.మన రాష్ట్రంలో ఎప్పుడూ రెడ్డి ప్రభుత్వమో లేక నాయుడు ప్రభుత్వమో మాత్రమే ఉంటుందా అనే ప్రశ్నను ప్రజల ముందు ఉంచుతూ… బహుజన వర్గాల రాజకీయ శక్తిని పెంచేందుకు బిసివై పార్టీని స్థాపించామని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసి బహుజన శక్తిగా ఎదిగితేనే నిజమైన రాజకీయ మార్పు సాధ్యమవుతుందని అన్నారు.రాబోయే రోజుల్లో బద్వేల్ నియోజకవర్గం నుంచే బిసివై పార్టీ బలోపేతం ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని విస్తరించి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని తెలిపారు. అలాగే త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసివై పార్టీ పూర్తిస్థాయిలో పోటీ చేస్తుందని, ప్రజలు తమకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన నాయకులు బిసివై పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తామని, బహుజన వర్గాల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పి రమేష్ యాదవ్ ,రామమోహన్ , నూరె నిర్మలా రేగల గడ్డ నారాయణ, శ్రీవరపు నరసింహా యాదవ్, పోలు మురళి కృష్ణ, రామయ్య, ఉంటా నరసింహా,శ్రీనివాసులు, సూర్య నారాయణ , హుస్సేయ్య, బాలకృష్ణ, గురప్పుడు ,చిన్న నారాయణ,మాధవ్, కిట్టయ్య,తిరపతయ్య, బాలారోశయ్య బాల పిచ్చయ్య బాల ఇసాయ్య తదితరులు పాల్గొన్నారు