విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని
వెల్గటూర్ ఎస్సై ఉదయ్ కుమార్
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మార్చి 16 (ప్రజావాణి):
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వెల్గటూర్ సబ్ ఇన్స్పెక్టర్ పులిచర్ల ఉదయ్ కుమార్ సూచించారు. సోమవారం జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాఫులే బీసీ గురుకుల పాఠశాలలో పోలీసు కళాబృందం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు కళాబృందం సామాజిక అంశాలపై అద్భుతమైన పాటలు పాడుతూ విద్యార్థులను ఉత్సాహపరిచారు. ప్రధానంగా షీ టీమ్, మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ఉన్న విభాగాల పనితీరు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సామాజిక రుగ్మతలు, గంజాయి నిర్మూలన, రోడ్డు ప్రమాదాల నివారణ. అత్యవసర సేవలు ఏదైనా ఆపద కలిగితే వెంటనే డయల్ 100కు సమాచారం అందించడంపై అవగాహన కల్పించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ… నేటి విద్యార్థులే రేపటి భారత పౌరులు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవరచుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జరుగుతున్న 10వ తరగతి పరీక్షలను గురించి మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.