బెజ్జంకి, జూన్ 7 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు ప్రత్యేక చొరవతో కరీంనగర్కు చెందిన సుప్రీమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు .సుప్రీమ్ హాస్పిటల్కు చెందిన డా. తిరుపతి సిరవేణి నేతృత్వంలోని వైద్య బృందం రక్తపోటు, మధుమేహం, హిమోగ్లోబిన్, సీబీసీ, ఈసీజీ తదితర వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించింది. అనారోగ్య సమస్యలతో వచ్చిన వారికి వైద్య సలహాలు అందించడంతో పాటు అవసరమైన మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. మరింత చికిత్స అవసరమైన రోగులను ఆసుపత్రికి రిఫర్ చేసే ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎర్రల జానకి రాజు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాల ద్వారా వ్యాధులను ముందస్తుగా గుర్తించి తగిన చికిత్స పొందే అవకాశం కలుగుతుందని తెలిపారు.
గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇలాంటి ఆరోగ్య శిబిరాలను తరచూ నిర్వహించాలని కోరారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ గ్రామంలో ఆరోగ్య అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని స్థానికులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు బండిపెల్లి రమేష్, తడకపల్లి పవన్, చింతలపల్లి లత కొండల్ రెడ్డి, సొల్లు బాలయ్య, న్యాలం శారద శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పులి శ్రీనివాస్, పైడిపల్లి శంకర్, గర్రెపల్లి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.