prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 8:32 am Digital Edition : PRAJA VANI

గస్తీలో అప్రమత్తతో దొంగల అరెస్ట్ 

గస్తీలో అప్రమత్తతో దొంగల అరెస్ట్

 

 

ప్రజావాణి

మార్చి :24

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

 

 

 

క్రైమ్ బీట్ సిబ్బందికి ఎస్పీ ప్రశంసలు, నగదు పురస్కారం అందజేత

నవతెలంగాణ-కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో రాత్రి గస్తీ నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించి దొంగలను పట్టుకున్న క్రైమ్ బీట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ యం.రాజేష్ చంద్ర ప్రశంసించారు. వారి విధినిబద్ధతను కొనియాడుతూ నగదు పురస్కారం అందజేశారు.

 

సోమ‌వారం రాత్రి సమయంలో కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద కాలనీలో క్రైమ్ బీట్ సిబ్బంది ఎం.ప్రశాంత్ రెడ్డి, హోంగార్డ్ టి.నర్సింలు గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో బైక్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గమనించి వారిని వెంబడించి ఆపి విచారించారు.

 

వారి వద్ద ఉన్న లేడీస్ బ్యాగ్‌పై అనుమానం వ్యక్తం చేసి ప్రశ్నించగా, సరైన సమాధానం చెప్పలేకపోవడంతో వారిని అదుపులోకి తీసుకుని బ్యాగును తనిఖీ చేశారు. అందులో మొబైల్ ఫోన్ లభించింది. అదే సమయంలో ఆ ఫోన్‌కు కాల్ రావడంతో సిబ్బంది స్పందించి మాట్లాడగా, అవతలి వైపు ఉన్న మహిళ తన బ్యాగ్‌ను దొంగలు ఎత్తుకెళ్లారని తెలిపింది.

 

బాధితురాలి వివరాలు సేకరించిన పోలీసులు, కామారెడ్డి బస్టాండ్ వద్ద ఈ ఘటన జరిగినట్లు గుర్తించి వెంటనే నిందితులను పట్టుకుని పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా వ్యవహరించి, సమయస్ఫూర్తితో దొంగలను పట్టుకుని బాధితురాలికి న్యాయం చేసిన ఎం. ప్రశాంత్ రెడ్డి, హోంగార్డ్ నర్సింలును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాత్రి గస్తీని మరింత కఠినతరం చేయాలని, ప్రజల ఆస్తి రక్షణ పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఇలాంటి అంకితభావం ఇతర సిబ్బందికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, డీఎస్పీలు ఎస్. శ్రీనివాస్ రావు, బి. విఠల్ రెడ్డి, వివిధ పోలీస్ స్టేషన్ల ఇన్స్పెక్టర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు