ఖబడ్దార్ బీఆర్ఎస్ నాయకులారా…
రేకొండ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోండి
రేకొండలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్మీట్లో నేతల ఫైర్
చిగురుమామిడి/రేకొండ, జూలై 9:
చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ బ్రిడ్జి అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రేకొండ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందె సురేష్ మాట్లాడారు.
హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీకి ప్రజల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. పదేళ్లపాటు అధికారంలో ఉండి రేకొండ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేసిన నాయకులు, ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి డ్రామాలు ఆడటం హాస్యాస్పదమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తుంటే, బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రేకొండ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి నిబద్ధత ఉందని, బ్రిడ్జి నిర్మాణంతో పాటు అన్ని అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్ మాట్లాడుతూ, ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై బీఆర్ఎస్ నాయకులు ఆధారాలు లేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. రాజకీయ లబ్ధి కోసం మంత్రి ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. “ఖబడ్దార్ బీఆర్ఎస్ నాయకులారా… మంత్రి పొన్నం ప్రభాకర్ గారిపై నిరాధార ఆరోపణలు చేస్తే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ప్రతి అబద్ధానికి ప్రజల ముందే వాస్తవాలతో సమాధానం ఇస్తాం. విమర్శలకు ముందు మీ పదేళ్ల పాలనలో చేసిన వైఫల్యాలకు సమాధానం చెప్పండి” అని హెచ్చరించారు.
చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందె సురేష్ మాట్లాడుతూ, రేకొండ బ్రిడ్జి పేరుతో బీఆర్ఎస్ నాయకులు చవకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. “పదేళ్లు అధికారంలో ఉండి రేకొండ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయని మీరు ఇప్పుడు మాట్లాడటం సిగ్గుచేటు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు కాలం చెల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తోంది. రేకొండ బ్రిడ్జి విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోంది. అసత్య ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే కాంగ్రెస్ పార్టీ గట్టిగా తిప్పికొడుతుంది” అన్నారు.
రేకొండ ప్రజల అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తోందని నాయకులు పేర్కొన్నారు.
ఈ సమావేశంలోసర్పంచులు మార్క రాజ్ కుమార్, కొంకట మౌనిక, అలువల శంకర్, డిసిసి జిల్లా కార్యదర్శిలు బడుకోలు దేవేందర్ రెడ్డి ,సాంబారీ బాబు, గ్రామ శాఖ అధ్యక్షులు గాదపాక సునీల్, మురహర రెడ్డి, ఇనుగాల శ్రీనివాస్ రెడ్డి, పూదరి వేణు, ఎలగందుల లక్ష్మణ్, దోమ శ్రీనివాస్ రెడ్డి, జున్నూరు ఐలయ్య, కాంతాళ మైపాల్ రెడ్డి, గడ్డం అనిల్, దొడ్ల రమణారెడ్డి, పరుపాటి జయపాల్ రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, పరుపాటి వెంకటరెడ్డి, కొలిపాక వేణు, మామిడి చంద్రయ్య, కొలిపాక కుమారస్వామి, జినుకల అజయ్, రాగుల సంపత్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.