కొత్తపేటలో రేపు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ
అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి పిలుపు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, ఏప్రిల్ 13 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు (మంగళవారం) ఉదయం ఘనంగా జరగనుంది. గ్రామ సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది, దీనికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆయన తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న, ఈ వేడుకకు మండలస్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంఘాల నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరుకానున్నారని సర్పంచ్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. మహనీయుడు అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, ఆయన విగ్రహాన్ని గ్రామంలో ప్రతిష్టించుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, యువకులు, అంబేద్కర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.