కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడికి బీజేవైఎం పిలుపు..
సిరిసిల్లలో ఉద్రిక్తత
సిరిసిల్ల, జూలై, ప్రజావాణి
మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించాలని బీజేపీ యువమోర్చా (బీజేవైఎం) పిలుపునివ్వడంతో సిరిసిల్లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముట్టడి కోసం బయలుదేరిన బీజేవైఎం నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
భారీ బందోబస్తు ఏర్పాటు
కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ముట్టడి ప్రయత్నాల నేపథ్యంలో మరో ముగ్గురు బీజేవైఎం నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో కార్యాలయం పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.