*కృత్రిమ మేధతో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు*
*డాక్టర్స్ డే వేడుకల్లో ఏరియా జిఎం రాధాకృష్ణ*
* *మన ప్రజావాణి*, మందమర్రి:- జులై 1
వైద్య శాస్త్రానికి కృత్రిమ మేధ (ఏఐ) తోడవడంతో మానవ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని సింగరేణి ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ తెలిపారు. బుధవారం డాక్టర్స్ డేని పురస్కరించుకుని ఏరియాలోని కేకే-1 డిస్పెన్సరీలో నిర్వహించిన వైద్యుల దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిఎం రాధాకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం వైద్య శాస్త్రం శాఖోపశాఖలుగా విస్తరిస్తుందని, గతంలో లొంగని రోగాలు సైతం లొంగివస్తున్నాయన్నారు. కృత్రిమ మేధ (ఏఐ) ఎంతగా విశ్లేషించినా చివరకు డాక్టర్ ను సంప్రదించమనే చెప్తుందని,అదే సమాజంలో డాక్టర్ కు ఉన్న ప్రాధాన్యత అని తెలిపారు. సింగరేణిలో గైర్హాజరయ్యే కార్మికులను డాక్టర్లు కౌన్సిలింగ్ చేసి, రెగ్యులర్ గా విధులు నిర్వహించేలా ప్రయత్నించాలని కోరారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఏరియా ఐఈడి డిజిఎం కే కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఆసుపత్రి సిబ్బంది ఓపికతో కార్మికులకు వైద్య సేవలు అందించాలన్నారు. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ మాట్లాడుతూ, సమాజంలో డాక్టర్ల సేవలు మరువలేనివని అందుకే వైద్యుడే నారాయణుడు అనే నానుడి ఉందన్నారు. అనంతరం డాక్టర్ పాక శ్రీజ కు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ జారీ చేసిన ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని ఏరియా జిఎం రాధాకృష్ణ అందజేశారు. అదే విధంగా కేకే డిస్పెన్సరీలో స్టాఫ్ నర్స్(కాంట్రాక్టు)
గా పనిచేసి, ములుగు ప్రభుత్వాసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా ఎంపికైన నక్క సుష్మ ను జిఎం,అతిథులతో పాటు ఆసుపత్రి సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేశ్వర్ రావు,మెడికల్ అధికారి డాక్టర్ హుస్సేన్ ఖాన్ అర్ఫాత్,డిస్పెన్సరి సిబ్బంది పాల్గొన్నారు.
