గౌడ సంఘం పెద్దమనుషుల అరాచకం బహిర్గతం.
కుల బహిష్కరణపై కేసు నమోదు
గౌడ సంఘం పెద్దమనుషుల అరాచకం బహిర్గతం.
శుభ కార్యాలకు పిలిచినా వారికి 50 వేల జరిమానా అంటూ తీర్మానం.
గౌడ సంఘ కుల పెద్ద మనుషులపై కేసు నమోదు చేసిన పోలీసులు.
తంగళ్లపెల్లి /ప్రజావాణి
సారంపల్లి గ్రామంలో కుల బహిష్కరణ ఘటన కలకలం రేపింది. గౌడ సంఘానికి చెందిన కొందరు పెద్దమనుషులు ఒక కుటుంబాన్ని సామాజికంగా వేరుచేసి, తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
గ్రామానికి చెందిన బాలసాని రమేష్ గౌడ్ (తండ్రి: పోశయ్య), వృత్తి వ్యవసాయం, తనకు గ్రామ శివారులో ఉన్న సుమారు 1 ఎకరం 39 గుంటల భూమిలో నుంచి గౌడ సంఘానికి 6 గుంటల స్థలం ఇవ్వాలని సంఘ పెద్దలు ఒత్తిడి చేసినట్లు ఆరోపించారు. అయితే ఆ స్థలాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో, కక్ష సాధించిన కుల పెద్దలు అతని కుటుంబంపై కుల బహిష్కరణ విధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
రెండు సంవత్సరాలుగా సామాజిక బహిష్కరణ
గత రెండు సంవత్సరాలుగా బాధిత కుటుంబం గ్రామంలో పూర్తిగా ఒంటరిపడిందని సమాచారం. వారితో ఎవరైనా మాట్లాడినా, శుభకార్యాలకు పిలిచినా రూ.50 వేల జరిమానా విధిస్తామని బెదిరింపులు జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కారణంగా కుటుంబం తీవ్ర మానసిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
పోలీసుల జోక్యం – కేసు నమోదు
ఈ ఘటనపై బాధితుడు రమేష్ గౌడ్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా, ఎస్ఐ స్పందించి గౌడ సంఘం కుల పెద్దమనుషులపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ… గ్రామాలలో ఎవరైనా పెద్ద మనుషులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని ఉల్లంఘిస్తే కుల బహిష్కరణ చట్టపరంగా నేరం అని బాధితులు ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు.