ఘట్కేసర్ జూన్ 6 : ఘట్కేసర్ మండలంలోని పోచారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పోచారం గ్రామానికి చెందిన వరికుప్పల రమేష్ (45) ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీ రాత్రి కుటుంబ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి భార్య మహేశ్వరి, రమేష్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన రమేష్ ఇంటి నుంచి వెళ్లిపోగా, అతని సోదరుడు శేఖర్ సముదాయించి తిరిగి ఇంటికి తీసుకువచ్చాడు. అయితే మరుసటి రోజు అయిన జూన్ 5న ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో భార్య విధులకు వెళ్లిన అనంతరం రమేష్ ఇంటి నుంచి ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, పరిచయస్తుల వద్ద ఆరా తీశారు. సమీప ప్రాంతాల్లో గాలించినప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. దీంతో రమేష్ భార్య మహేశ్వరి పోచారం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రమేష్ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్కు లేదా కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.