ఘట్కేసర్, జూన్ 30: ఘట్కేసర్ మండలంలోని కాచవాని సింగారం గ్రామంలో ల్యాండ్ పూలింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. మంగళవారం ఘట్కేసర్ మండల ఎమ్మార్వో చంద్రశేఖర్ ఆదేశాల మేరకు డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ సాయిరాం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 70 మంది భూ యజమానులు స్వచ్ఛందంగా పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా గ్రామాల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు. భూ యజమానులు ప్రభుత్వ నిబంధనలు, ప్రయోజనాలను పూర్తిగా అవగాహన చేసుకుని తమ నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
జూలై 1న ముత్వెల్లిగూడ గ్రామ ప్రజల కోసం కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముత్వెల్లిగూడ గ్రామంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భూ యజమానులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన కోరారు. ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను విజయవంతం చేయడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.