prajavaani.net
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 3:47 am Digital Edition : VENU THIRUMALAYAPALEM

కాకరవాయి వేణుగోపాల స్వామి గుడి మాన్యం ఏమైనట్టు..?

తిరుమలాయపాలెం,ప్రజావాణి:

కాకరవాయి గ్రామంలోని వేణుగోపాల స్వామి దేవాలయానికి సంబంధించిన మాన్యం భూముల వ్యవహారం పై రోజురోజుకూ అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ పెద్దలనుంచి వెలువడిన వివరాల  ప్రకారం గుడి పేరిట సుమారు 12 ఎకరాల మాన్యం భూమి ఉన్నప్పటికీ, అధికారిక రికార్డుల్లో ఆ వివరాలు కనిపించకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది.ఈ నేపథ్యంలో దేవాలయ ప్రధాన అర్చకుడి పాత్రపై గ్రామ ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గుడి మాన్యం భూముల వివరాలు బయటపడకపోవడం వెనుక సూత్రధారుడు అర్చకుడేనని కొందరు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మాన్యం భూముల చిట్టా బయటపెట్టకపోవడం, గుడి ఆస్తులపై పారదర్శకత లేకపోవడం వల్ల ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయని వారు అంటున్నారు.

గతంలో దేవాలయ కమిటీ కూడా మాన్యం వివరాలు వెల్లడించకపోవడం, ప్రస్తుతం అర్చకుడిపై వస్తున్న ఆరోపణలు కలిపి ఈ వ్యవహారాన్ని మరింత సంక్లిష్టంగా మార్చాయి. గుడి ఆస్తులు ఎక్కడ ఉన్నాయి..? ఎవరి ఆధీనంలో ఉన్నాయి..? వాటి నుంచి వచ్చే ఆదాయం ఎక్కడికి వెళ్తోంది..? అన్న ప్రశ్నలు గ్రామంలో వినిపిస్తున్నాయి.ప్రస్తుతం దేవాలయ వ్యవహారాలు సర్పంచ్ పరిధిలోకి రావడంతో, ఈ వివాదంపై స్పష్టత వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత సర్పంచ్ ఈ అంశంపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటపెడతారా..? లేక గత కమిటీ బాటలోనే నడుస్తారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రామ ప్రజలు చెబుతున్న ప్రకారం, గుడి మాన్యం భూములపై త్వరగా పూర్తి వివరాలు వెల్లడించకపోతే ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, దేవాలయ ఆస్తులపై పారదర్శకత తీసుకురావాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ వివాదం మరింత ముదురుతున్న నేపథ్యంలో, అధికారులు తీసుకునే చర్యలపై గ్రామ ప్రజలు ఎదురుచూస్తున్నారు.