ఘట్కేసర్, ఆగస్టు 7: ఎలాంటి కారణం లేకుండా ఓ వ్యక్తిని ఇద్దరు యువకులు దూషించి, బీర్ బాటిల్తో తలపై కొట్టిన ఘటన ఔషాపూర్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఘట్కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔషాపూర్లోని కంఠమహేశ్వర దేవాలయం వద్ద శుక్రవారం రాత్రి ఒంటిగంట సమయంలో డొంకని బాలరాజు (38), తండ్రి నారాయణ, ఉన్నాడు. అదే సమయంలో ఔషాపూర్కు చెందిన పవన్ కళ్యాణ్, సన్నీ అనే ఇద్దరు వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండా బాలరాజును దూషించినట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం తాగుతున్న బీర్ బాటిల్తో బాలరాజు తలపై కొట్టడంతో అతడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే స్పృహ కోల్పోయినట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.