ఘట్కేసర్, ఆగస్టు 1: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు.
పోలీసుల వివరాల ప్రకారం.. చైతన్యపురికి చెందిన మహేంద్ర దిలీప్ బాయ్ చౌహన్ (45), స్వస్థలం సూరత్, తన ద్విచక్ర వాహనంపై చైతన్యపురి నుంచి హనుమకొండకు వెళ్తుండగా, ఉదయం సుమారు 9:44 గంటల సమయంలో ఔషాపూర్లోని హెచ్పీసీఎల్ సంస్థ సమీపానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో తన ముందుగా వెళ్తున్న గుర్తు తెలియని కారును ఢీకొట్టడంతో బైక్పై నుంచి కిందపడిపోయాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ అతనిపైకి దూసుకెళ్లడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఘట్కేసర్ పోలీసులు తెలిపారు.