ఘట్కేసర్, జూలై 22 : రాబోయే పది రోజుల పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఓటు హక్కు పరిరక్షణ కోసం కృషి చేయాలని ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రె రాజేష్ పిలుపునిచ్చారు. బుధవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
ప్రతి వార్డులో ఎస్ఐఆర్ పర్యవేక్షణలో బీఎల్ఏలతో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా చూడటంతో పాటు, జాబితాలో ఉన్న తప్పులను గుర్తించి వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, దానిని కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బండ్లగూడెం అనిల్ గౌడ్, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బండ్లగూడెం క్రాంతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.