ఘట్కేసర్, జూలై 7: మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఘట్కేసర్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎల్ఆర్ఎస్కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలనలో భాగంగా ఎల్-1, ఎల్-2, ఎల్-3 స్థాయిల ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన దరఖాస్తుదారులకు ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎల్ఆర్ఎస్ ఫీజుపై ప్రభుత్వం కల్పించిన 25 శాతం రాయితీ ఈ నెల 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో, కార్యాలయ సిబ్బంది దరఖాస్తుదారులకు ఈ విషయాన్ని విస్తృతంగా తెలియజేయాలని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని కోరారు.
సమీక్ష సమావేశంలో ఎల్-1, ఎల్-2, ఎల్-3 అధికారులతో కమిషనర్ దరఖాస్తుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ కమిషనర్ శ్రీమతి వాణి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాజీవ్ రెడ్డి, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ శ్రీదేవి తదితర అధికారులు, ఎల్-1 సిబ్బంది పాల్గొన్నారు.