నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మే 27 (ప్రజావాణి):
ఎండపల్లి మండల పరిధిలోని పలు ఎరువులు, విత్తనాల దుకాణాలను బుధవారం రోజున ఎండపల్లి మండల వ్యవసాయ అధికారి కామల్ల మహేష్, ఉమ్మడి వెల్గటూర్ మండల ఎస్ ఐ పి ఉదయ్ కుమార్ సంయుక్తంగా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా దుకాణాలలోని స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులను అధికారులు నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. డీలర్లు ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యంగా ఫెర్టిలైజర్స్ (ఎరువులను) ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించినా, మార్కెట్లోకి నకిలీ పురుగు మందులు, నకిలీ విత్తనాలు, నిషేధిత హెచ్టీ కాటన్ విత్తనాలను తెచ్చి అమ్మినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీలర్లను హెచ్చరించారు. అదేవిధంగా, ప్రస్తుత సీజన్ దృష్ట్యా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉన్న సన్న వరి రకాల విత్తనాలను రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, ఎలాంటి కృత్రిమ కొరత సృష్టించవద్దని సీడ్ డీలర్లను ఆదేశించారు. రైతులు మోసపోకుండా ఉండేందుకే ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు స్పష్టం చేశారు.