prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 7:24 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఎదులాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ఏఐ డిజిటల్ ల్యాబ్ ప్రారంభం… టీడీఎఫ్ ‘మన తెలంగాణ బడి’ కార్యక్రమంలో మరో ముందడుగు

ఎదులాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో ఏఐ డిజిటల్ ల్యాబ్ ప్రారంభం…

టీడీఎఫ్ ‘మన తెలంగాణ బడి’ కార్యక్రమంలో మరో ముందడుగ

 

ఘట్‌కేసర్, జూలై 23 (ప్రజావాణి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని చేరువ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరం (టీడీఎఫ్) ఆధ్వర్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ జెడ్పీహెచ్‌ఎస్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు. టీడీఎఫ్ అమెరికా అట్లాంటా చాప్టర్, టీడీఎఫ్ ఇండియా సంయుక్త సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ల్యాబ్‌కు స్వాతి సుదిని, విక్రమ్ రెడ్డి సుదిని దంపతులు ఆర్థిక సహకారం అందించారు. ల్యాబ్‌లో ఐదు అత్యాధునిక కంప్యూటర్లు, నెట్‌వర్కింగ్ వ్యవస్థతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా టీడీఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కృత్రిమ మేధస్సు వంటి అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించి డిజిటల్ అంతరాన్ని తగ్గించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు. టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, “మన తెలంగాణ బడి” కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ఆధారిత డిజిటల్ లెర్నింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి టీడీఎఫ్ కట్టుబడి ఉందన్నారు. ల్యాబ్ ఏర్పాటుకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

అదే సందర్భంగా టీడీఎఫ్ జైకిసాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “కమ్యూనిటీ ఆధారిత విత్తన బ్యాంక్” కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు దేశీయ విత్తనాలను పంపిణీ చేసి, సంప్రదాయ విత్తన సంపద పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. అలాగే కొండల వెంకట కృష్ణారెడ్డి బాలుర ప్రభుత్వ పాఠశాలకు మరో కంప్యూటర్ ల్యాబ్‌ను విరాళంగా అందజేస్తామని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో టీడీఎఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ స్వాతి సుదిని, విక్రమ్ రెడ్డి సుదిని, జాయింట్ ట్రెజరర్ అవినాష్ కళ్యాంకర్, కె. అరవింద్, టీడీఎఫ్ ఇండియా అధ్యక్షుడు మట్ట రాజేశ్వర్ రెడ్డి, వనిత చేయూత చైర్‌పర్సన్ టి. వాణి, జైకిసాన్ చైర్మన్ పాటి నరేందర్ రెడ్డి, కొండల వెంకట కృష్ణారెడ్డి, కొండల విద్యాసాగర్ రెడ్డి, కొండల ప్రేమ్ సాగర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కృష్ణకుమారి, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.