*ఎండ వేడిమిని తట్టుకునేందుకు ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్స్, క్యాప్స్ (హ్యాట్స్), గ్లూకోజ్ పౌడర్, పంపిణీ చేసిన – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*
*నల్గొండ జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలను నియంత్రిస్తూ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో టిఎస్జీఆర్ఇఎ నల్గొండ జిల్లా సంఘం సహకారంతో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ చేతుల మీదుగా ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వాటర్ బాటిల్స్, క్యాప్స్ (హ్యాట్స్), గ్లూకోజ్ పౌడర్, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించేందుకు క్లాత్ బ్యాగులు సుమారు రూ.50,000 విలువ గల తదితర సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మండుటెండల్లోనూ ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీసులు అంకిత భావంతో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. రోడ్లపై గంటల తరబడి నిలబడి వాహనాల రాకపోకలను సమన్వయం చేస్తూ ప్రమాదాలు జరగకుండా కృషి చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. ప్రజలు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ట్రాఫిక్ పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని, ఎండలు, వర్షాలు వంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా విధి నిర్వహణలో రాజీ పడరని పేర్కొన్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్ ముందుకు వచ్చి సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. పోలీస్ శాఖకు అండగా నిలుస్తూ సామాజిక బాధ్యతతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టిఎస్జిఆర్ఇఎ (తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్) ప్రతినిధులకు జిల్లా ఎస్పీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తరచూ నీరు తాగుతూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. ప్రజలు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, టిఎస్జీఆర్ఇఎ జి. దామోదర్ రెడ్డి (రాష్ట్ర గౌరవాధ్యక్షులు), జి. వెంకట్ రెడ్డి (జిల్లా అధ్యక్షులు), జి. నారాయణ రెడ్డి (భవన కమిటీ చైర్మన్), కె. యుగేందర్ రెడ్డి (రాష్ట్ర ఉపాధ్యక్షులు), ఉపాధ్యక్షులు ఆంజనేయులు, కృష్ణయ్య, సి హెచ్ యాదగిరి, ఆర్థిక కార్యదర్శి, ఎం. శంకర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి,మండల కార్యదర్శి వాసుదేవ్, కె. రామలింగం, రమేష్, కోర్ కమిటీ ఛైర్మెన్, రామనాధం, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.