మన ప్రజావాణి ప్రతినిధి చిగురుమామిడి ; చిగురుమామిడి మండలం ఉల్లంపల్లి గ్రామంలో వరి పంటలను సోమవారం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎన్. వెంకటేశ్వరరావు, మానకొండూరు ఏడీఏ శ్రీధర్ ఆధ్వర్యంలో పరిశీలించారు. ఈ సందర్భంగా వరి పంట ప్రస్తుతం పీలక దశలో ఉండగా కొన్నిచోట్ల మోగి పురుగు ప్రభావం కనిపిస్తున్నట్లు వారు తెలిపారు.
మోగి పురుగు నివారణకు కార్తప్ హైడ్రోక్లోరైడ్, ఐసోసైక్లోసిరం మందులను రెండు గ్రాముల చొప్పున ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి పంటకు అగ్గి తెగులు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండి తగిన మందులు వాడాలని పేర్కొన్నారు.అదేవిధంగా చివరి దఫా ఎరువులు చల్లుకునేటప్పుడు యూరియాతో పాటు ఎకరానికి 30 కిలోల పొటాష్ వేయాలని సూచించారు. కొన్నిచోట్ల ఆకులపై తుప్పురంగు మచ్చలు ఏర్పడి ఎదుగుదల లోపిస్తే అది జింకు పోషక లోపం కావచ్చని, అటువంటి పరిస్థితుల్లో లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున జింకు మందును కలిపి వారం రోజుల్లో రెండు సార్లు పిచికారీ చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త విజయ్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) అంజలి, రైతులు పాల్గొన్నారు.