prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 July 2026, 9:10 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు..జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి

 ప్రభుత్వ కార్యక్రమాల విజయానికి ఉద్యోగుల సమన్వయం ఎంతో కీలకం

కడప,జూలై 16 ప్రజావాణి జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి తెలిపారు.ప్రభుత్వ కార్యక్రమాల విజయవంతమైన అమలులో అన్ని శాఖల ఉద్యోగుల సమన్వయం,అంకితభావం ఎంతో కీలకమని పేర్కొన్నారు.బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో డిఆర్వో మల్లికార్జునుడు,జిల్లాలోని వివిధ ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు,ఎన్జీఓ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.ఉద్యోగుల ఆరోగ్యమే వారి సేవలకు పునాదని పేర్కొన్న కలెక్టర్,ప్రతి ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.ఆరోగ్యం బాగుంటేనే విధులను సమర్థవంతంగా నిర్వహించగలరని,కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలని అన్నారు.ఉద్యోగులు తమకు ఎదురయ్యే ఏ సమస్యనైనా వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు.ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.వినతులను నమోదు చేసుకున్న జిల్లా కలెక్టర్.జిల్లా స్థాయిలో పరిష్కరించగల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని,రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలను సంబంధిత శాఖలకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఉద్యోగ సంఘాల సమావేశాలు, కార్యక్రమాల నిర్వహణ కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిపై స్పందిస్తూ,అన్ని ఉద్యోగ సంఘాలు సమన్వయంతో ముందుకు వస్తే జిల్లా యంత్రాంగం తరఫున తగిన స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.జిల్లాలో అమలవుతున్న ప్రతి ప్రభుత్వ కార్యక్రమం విజయవంతం కావాలంటే అన్ని శాఖల ఉద్యోగుల సమన్వయం ఎంతో అవసరమన్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో అమలవుతున్న కార్యక్రమాలను ప్రస్తావిస్తూ.పాఠశాల విద్యార్థులకు ప్రతిరోజూ సుమారు లక్ష మందికి నాణ్యమైన,పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించే బృహత్తర కార్యక్రమాన్ని జిల్లాలో ఒక గొప్ప బాధ్యత తీసుకుని దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు.ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగడానికి సంబంధిత శాఖలు,అధికారులు,సిబ్బంది సమష్టిగా పనిచేస్తున్నారని,ప్రతి రోజూ పనితీరులో మరింత మెరుగుదల సాధించేలా అందరూ కృషి చేయాలని సూచించారు.అదేవిధంగా,ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ప్రతి ఉద్యోగి బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ కోరారు. ఉద్యోగులు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు,బంధుమిత్రులు ఎవరైనా ఇంకా నమోదు చేసుకోకపోతే వెంటనే నమోదు చేసుకునేలా చైతన్యం కల్పించాలని సూచించారు.అవసరమైన పత్రాలను సమర్పించి నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తి చేసి,జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు.