బెజ్జంకి, ఆగస్టు 8 (ప్రజావాణి)
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) నాయకులు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని సత్యార్జున ఫంక్షన్ హాల్లో బెజ్జంకి, గన్నేరువరం మండలాల ఉద్యమకారుల సమావేశాన్ని TUF రాష్ట్ర కార్యదర్శి శానగొండ శరత్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వోరగంటి ఆనంద్ హాజరయ్యారు.
ఉద్యమకారులకు న్యాయం చేయాలి
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు తమ కుటుంబాలను, ఉద్యోగాలను, వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి ఉద్యమించారని వోరగంటి ఆనంద్ అన్నారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడుస్తున్నా ఉద్యమకారులు ఆర్థికంగా, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యమకారులకు గుర్తింపు, గౌరవం కల్పించేందుకు TUF గత ఎనిమిదేళ్లుగా నిరంతరం పోరాటం చేస్తోందన్నారు.ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం తొలి విజయమని పేర్కొన్నారు. కమిటీ వెంటనే నివేదిక అందించి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం, రూ.25 వేల పెన్షన్, ఉచిత రవాణా, ఉచిత వైద్యం, పిల్లలకు ఉచిత విద్య అందించడంతో పాటు ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ సమావేశంలో బెజ్జంకి, గన్నేరువరం మండలాలకు చెందిన తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.