prajavaani.net
Newspaper Banner
Date of Publish : 12 May 2026, 12:50 am Digital Edition : PRAJA VANI

ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభం

ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభం
..సీనియర్ సిటిజన్ లు సద్వినియోగం చేసుకోవాలి
మందమర్రి, (మన ప్రజావాణి) మే 11:

మందమర్రి పట్టణంలోని సింగరేణి గ్రౌండ్ లో 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం ఏర్పాటు చేసిన ఉచిత యోగా శిక్షణ తరగతులను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, పట్టణ మున్సిపల్ కమిషనర్ తుంగపిండి రాజలింగు సోమవారం ప్రారంభించారు.
మందమర్రి పట్టణ యోగా గురువు కొంపెల్లి రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులు సీనియర్ సిటిజన్ల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఏరియా జీఎం రాధాకృష్ణ, మున్సిపల్ కమిషనర్ రాజలింగు యోగా శిక్షణను ప్రారంభించి పాల్గొనేవారిని అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ యోగాభ్యాసం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చని తెలిపారు. “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే నానుడిని స్మరింపజేస్తూ, నిత్యం యోగా సాధన చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు అనేక రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయని పేర్కొన్నారు.
యోగా గురువు కొంపెల్లి రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ తరగతులను సీనియర్ సిటిజన్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యోగ సాధన ద్వారా శ్వాసకోశ సమస్యలు, రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటి అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని తెలిపారు.
యోగ మానవాళి ఆరోగ్య సంరక్షణకు నిజ జీవితంలో ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతిరోజూ క్రమం తప్పకుండా యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, సీనియర్ సిటిజన్లు, రిటైర్డ్ కార్మికులు  పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.