ఉండేడలో వైభవంగా ఉగాది వేడుకలు
అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి మార్చి 19 (ప్రజావాణి):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం ఉండేడ గ్రామంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. గ్రామ శివారులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఉగాదిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు పర్వతగిరి ప్రశాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు గ్రామ ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ ప్రాంగణమంతా భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద, వితరణ చేశారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆవుల మమత – తిరుపతి యాదవ్, ఉప సర్పంచ్ పోతు రవి, వార్డుల సభ్యులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. నూతన సంవత్సరంలో గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు కలగాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు.