prajavaani.net
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:47 am Digital Edition : RAKESH PEDDAPALLY

ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి షీ టీమ్ ఎస్‌ఐ లావణ్య

 

• పెద్దపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు

పెద్దపల్లి 28 ప్రజావాణి:

రామగుండం సి.పి.  ఆదేశాల మేరకు పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) ఉన్నత పాఠశాలలో షీ టీమ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షీ టీమ్ ఇన్ఛార్జ్, ఎస్‌ఐ లావణ్య  మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సమాజంలో జరుగుతున్న మార్పులు మరియు సాంకేతికత వినియోగంపై పూర్తి అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

సోషల్ మీడియా ప్రభావం – పోక్సో యాక్ట్‌పై అవగాహన

ప్రస్తుత రోజుల్లో విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా ఉంటోందని, దానిని మంచి ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలని ఎస్‌ఐ లావణ్య సూచించారు. విద్యార్థులు తమ ప్రవర్తనా నియమావళిని విస్మరించకూడదని పేర్కొంటూ, బాలల పరిరక్షణకు ఉన్న ‘పోక్సో (POCSO) యాక్ట్’ గురించిన ప్రాథమిక వివరాలను వివరించారు. అలాగే నేటి యువతను పీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండాలని, ఆన్‌లైన్ మోసాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఈవ్‌టీజింగ్‌పై నిరంతర నిఘా – హెల్ప్‌లైన్ నంబర్లు

మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం ప్రతిరోజూ బస్టాండ్‌, ప్రధాన చౌరస్తాలు, జనసమీకరణ ప్రాంతాలు మరియు పాఠశాలలు, కళాశాలల సమీపంలో షీ టీమ్ నిరంతర నిఘా ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. ఎవరైనా ఈవ్‌టీజింగ్ లేదా వేధింపులకు గురిచేస్తే విద్యార్థినులు భయపడకుండా 6303923700 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఏదైనా ప్రమాదం లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 100 / 112 నంబర్లకు డయల్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సంప్రదించాలని కోరారు. అలాగే మహిళలు ప్రయాణించే సమయంలో తమ భద్రత కోసం తెలంగాణ పోలీసుల అధికారిక ‘T-Safe App’ ఉపయోగించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెడ్‌మాస్టర్, ఉపాధ్యాయులు విద్యార్థులకు భద్రతపై దిశానిర్దేశం చేసిన ఈ సదస్సులో పాఠశాల హెడ్‌మాస్టర్ వెంకటనర్సయ్య, ఉపాధ్యాయ బృందం, షీ టీమ్ సభ్యులు సురేష్, మౌనిక, స్నేహలత, పెద్ద సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.