సైబర్ నేరాల నివారణలో ప్రతి ఒక్కరి బాధ్యత.
“సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ”లో భాగంగా అవగాహన సదస్సు

రామగుండం, ఆగస్టు 5 ప్రజావాణి :
ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. “సురక్షా తిరంగా – సైబర్ స్వతంత్ర తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా గోదావరిఖని ఇల్లందు క్లబ్లో నిర్వహించిన సైబర్ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ సైబర్ అవగాహన పోస్టర్లను విడుదల చేసి, పాల్గొన్న అధికారులతో సైబర్ భద్రత ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సైబర్ నేరాలు, ఇన్వెస్ట్మెంట్ మోసాలు, ఓటీపీ–కేవైసీ మోసాలు, నకిలీ లింకులు, డీప్ఫేక్ టెక్నాలజీ ద్వారా జరుగుతున్న మోసాలపై వివరంగా అవగాహన కల్పించారు.
ప్రస్తుతం నమోదవుతున్న సైబర్ నేరాల్లో దాదాపు 30 శాతం ఇన్వెస్ట్మెంట్ మోసాలేనని, ముఖ్యంగా ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన వారు నేరగాళ్ల లక్ష్యంగా మారుతున్నారని తెలిపారు. అధిక లాభాల పేరుతో వచ్చే ప్రకటనలు, అనుమానాస్పద యాప్లు, తెలియని లింకుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. “ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు” అని చెప్పే ఆఫర్లు మోసానికి సంకేతమని గుర్తించాలని సూచించారు.
సైబర్ మోసానికి గురైనట్లు అనుమానం వచ్చిన వెంటనే 1930 హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని, త్వరగా స్పందిస్తే నష్టాన్ని తగ్గించే అవకాశం ఉంటుందని చెప్పారు. సైబర్ భద్రత పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
సింగరేణి ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖ చేపట్టిన ఈ అవగాహన కార్యక్రమం సమయోచితమని, సంస్థలోని ప్రతి ఉద్యోగికి సైబర్ భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఏఐ ఆధారిత డీప్ఫేక్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, వీడియో కాల్స్, వాయిస్ మెసేజ్లను వెంటనే నమ్మకుండా నిర్ధారించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ బి. రామ్రెడ్డి, సైబర్ క్రైమ్ ఏసీపీ రంగారెడ్డి, గోదావరిఖని ఏసీపీ రమేష్, వన్టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్జల్ తదితరులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.