prajavaani.net
Newspaper Banner
Date of Publish : 03 February 2026, 12:48 pm Digital Edition : PRAJA VANI

ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి*

*ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి*

 

*జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు.*

 

 

భద్రాద్రి జిల్లా బ్యూరో/మన ప్రజావాణి (ఫిబ్రవరి 03): జిల్లాలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ వార్షిక ప్రయోగ పరీక్షలను పకడ్బందీగా, నిబంధనల ప్రకారం నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలో మంగళవారం ఆయన ములకలపల్లి, అశ్వరావుపేట మండలాల్లోని పలు జూనియర్ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ములకలపల్లి మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి ప్రయోగ పరీక్షల నిర్వహణ విధానం, ప్రయోగశాలల ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు, ప్రశ్నపత్రాల భద్రత తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. అనంతరం అశ్వరావుపేట మండలంలోని ఒక ప్రైవేట్ జూనియర్ కళాశాలను కూడా తనిఖీ చేసి పరీక్షలు నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా లేదా అన్న విషయాన్ని పరిశీలించారు.

 

రెండవ రోజు నిర్వహించిన ప్రయోగ పరీక్షల హాజరు వివరాలను సమీక్షించిన జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి, ఉదయం నిర్వహించిన పరీక్షలలో సాధారణ విభాగానికి కేటాయించిన 1,295 మందిలో 1,263 మంది హాజరుకాగా 32 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. వృత్తి విద్య విభాగానికి కేటాయించిన 1,386 మందిలో 1,207 మంది హాజరుకాగా 179 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. మొత్తం ఉదయం జరిగిన పరీక్షలకు 2,681 మందికి గాను 2,470 మంది హాజరై 211 మంది గైర్హాజరయ్యారని వెల్లడించారు. అలాగే మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలలో సాధారణ విభాగానికి కేటాయించిన 880 మందిలో 861 మంది హాజరుకాగా 19 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. వృత్తి విద్య విభాగానికి కేటాయించిన 1,365 మందిలో 1,308 మంది హాజరుకాగా 58 మంది గైర్హాజరయ్యారని చెప్పారు. మొత్తం మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 2,245 మందికి గాను 2,169 మంది హాజరై 77 మంది గైర్హాజరయ్యారని తెలిపారు.

 

ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ, ప్రయోగ పరీక్షలు పూర్తయ్యే వరకు అన్ని పరీక్ష కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని కళాశాల యాజమాన్యాలను ఆయన ఆదేశించారు.