prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 July 2026, 7:50 am Digital Edition : NNARSINGARAO GATKESKAR

ఆర్టీసీ ఆదాయ వృద్ధే లక్ష్యంగా కృషి చేయాలి చెంగిచెర్ల డిపో ఉద్యోగులకు డీఆర్‌ఎం మహేష్ కుమార్ పిలుపు అధిక ఆదాయం సాధించిన కండక్టర్లు, ఇంధనం ఆదా చేసిన డ్రైవర్లకు సన్మానం

చెంగిచెర్ల, జూలై 3: రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ సంస్థకు అధిక ఆదాయం సమకూర్చేందుకు కృషి చేయాలని సికింద్రాబాద్ రీజియన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ (డీఆర్‌ఎం) మహేష్ కుమార్ పిలుపునిచ్చారు.

గురువారం చెంగిచెర్ల ఆర్టీసీ డిపోను ఆకస్మికంగా సందర్శించిన ఆయన డిపో కార్యకలాపాలను పరిశీలించి, కార్యాలయ రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ అభివృద్ధికి మరింతగా తోడ్పడగలరని, వ్యక్తిగతంగా కూడా సంక్షేమంగా ఉండగలరని సూచించారు. సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా డిపో ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం నిర్వహించిన ఆదర్శ ఉద్యోగుల అభినందన కార్యక్రమంలో అధిక ఆదాయం సాధించిన కండక్టర్లు, ఇంధన పొదుపులో ప్రతిభ కనబరిచిన డ్రైవర్లను శాలువాలతో సన్మానించి నగదు బహుమతులు అందజేశారు.

ఉద్యోగుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా సంస్థ మరింత పురోగతి సాధిస్తుందని మహేష్ కుమార్ పేర్కొన్నారు. సమిష్టి కృషి, జట్టు భావనతో పనిచేసి చెంగిచెర్ల డిపోను రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం సాధించే ఆదర్శ డిపోగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ ఎస్. స్వాతి, అసిస్టెంట్ మేనేజర్ (ట్రాఫిక్) ఆనందరావు, అసిస్టెంట్ మేనేజర్ (మెకానిక్) సత్తయ్య, ఆఫీస్ సూపరింటెండెంట్ లక్ష్మీకళ్యాణి, డిప్యూటీ సూపరింటెండెంట్ లక్ష్మి, డిపో ఉద్యోగులు పాల్గొన్నారు.